*భారతీయ సామాజిక సంస్కర్త, విద్యావేత్త, రచయిత్రి, ఉద్యమ కారిణి సావిత్రిబాయి ఫులే జయంతి*
సావిత్రిబాయి ఫులే ( 3 జనవరి 1831 – 10 మార్చి 1897 ) భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, విద్యావేత్త, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫులే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. సామాజిక పెత్తనానికి వ్యతిరేకంగా, నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేశారు. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫులే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. హేతుత్వం, సత్యం, సమానత్వం, మానవత్వం పునాదులుగా ఆమె ఉద్యమాలను నిర్మించారు.
జీవిత విశేషాలు
---------------------
ఆమె మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో, 1831 జనవరి 3 న మాలి కమ్యూనిటీకి చెందిన దంపతులకు జన్మించారు. సావిత్రి బాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్ జిల్లా లో బోధన్, నాందేడ్ కొండల్ వాడి ప్రాంతంలో, అదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నారు. ఆమె తన 9 వ యేట 12 యేండ్ల జ్యోతిరావు ఫులేను 1840 లో వివాహమాడారు. నిరక్షరాస్యురాలిగా ఉన్న ఆమెకు భర్త జ్యోతిరావు ఫులే మొదటి గురువు. జ్యోతీరావు ఫులే ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలయ్యారు. అహ్మద్ నగర్ లో ఉపాధ్యాయ శిక్షణ పొంది, 1848 లో భర్త జ్యోతిరావుతో కలిసి క్రింది కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాల నడపటం ఉన్నత, అగ్రవర్ణాలకు నచ్చలేదు. దీంతో ఆమెపై వేధింపులకు, భౌతికదాడులకు పూనుకున్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం, అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు. బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తరువాత మార్చుకుని, మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేవారు. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా "నా విధిని నేను నిర్వహిస్తున్నాను" అని చెప్పేవారు. అయినా రోజూ వేధింపులకు విసిగి ఒకరోజు ఒకడి చెంప పగులగొట్టారు. పట్టు వీడక వారు సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం, గుర్తింపు లభించాయి. ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడికి కేటాయించాడు. కొంత మంది పుస్తకాలు సేకరించారు. మోరోవిఠల్, వాల్వేకర్, దియోరావ్ వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు. బాలికల చదువు కోసం, విద్యాభివృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఉపాధ్యాయురాలిగా
---------------------------
అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో, ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రాహ్మణవాద సంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి 1848 లో మెుట్టమెుదటి పాఠశాల ప్రారంభించారు. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె. కేవలం 4 సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి, ఉచిత విద్యనందించారు. 1848 లోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మెుదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆమె. దళితుల, స్త్రీల విద్యావ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమే. వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే 1849లో పూలే, సావిత్రీబాయి దంపతులను గృహ బహిష్కారానికి గురిచేశారు.
సామాజిక విప్లవకారిణిగా
---------------------------------
ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్ర్తీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవామండల్ అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించారు. లింగ సమస్యలకు తోడుగా, కుల, పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం ఈ సంస్థ కృషిచేసింది. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించారు సావిత్రిబాయి ఫూలే. 1863 లో ఫులే దంపతులు బాల హత్య ప్రతిబంధక్ గృహాన్ని స్థాపించారు. అసత్యాలతో, అగ్రవర్ణ దురహంకారపు నిచ్చెనమెట్ల కులవ్యవస్థగా నిర్మాణమైన సమాజంలో సత్యాన్ని శోధించడానికి 1873 లో తన భర్త మహత్మా ఫులేతో కలసి "సత్యశోధక్ సమాజ్ "ను ప్రారంభించి బాల్యవివాహాలకు, మూఢనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేకంగా, వితంతువు పునర్వివాహాల కొరకు అసమాన బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి పురుళ్లు పోసి వారి కళ్లల్లో వెలుగు చూసారు. అలా పురుడు పోసుకుని తన వద్దే వదిలేసి పోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకున్నారు. యశ్వంత్ గా నామకరణం చేసి తమ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి పెద్ద చేసారు. వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించి, క్షురకులను చైతన్యపర్చి, వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకుల చేత 1860లో సమ్మె చేయించారు సావిత్రీబాయి. సత్యశోధక్ సమాజ్ మహిళా విభాగం సావిత్రీబాయి నేతృత్వంలో నడిచేది. వివాహాలు వంటి శుభ కార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని ఈ సంస్థ ప్రారంభించింది. 1873 డిసెంబరు 25 న భార్యను కోల్పోయిన ఒక యువకునికి తన స్నేహితురాలి కుమార్తెతో సత్యశోధక్ సమాజ్ ఆధ్వర్యాన సావిత్రీబాయి వివాహం జరిపించారు. 1868 నుంచి సావిత్రీబాయి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. 1870లో ఒకసారి, 1896లో మరోసారి దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు ఫూలే దంపతులు చేసిన కృషి అనన్య సామాన్యం. కరువు వాతపడిన కుటుంబాలలోని అనాథ బాలలను దాదాపు 2,000 మందిని అక్కున చేర్చుకున్నారు. తమ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించారు.
రచయిత్రిగా
---------------
సావిత్రిబాయి సంఘ సంస్కర్తగానే గాదు, రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు. 1854 లోనే ఆమె తన కవితా సంపుటి ‘కావ్యఫులే’ను ప్రచురించారు. మరో కవితా సంపుటి ‘పావన కాశీ సుబోధ్ రత్నాకర్’ను 1891లో ప్రచురించారు. ఆమె ఉపన్యాసాల్లో కొన్ని 1892లో పుస్తకరూపంలో వచ్చాయి.
భర్త మరణం
-----------------
జ్యోతీరావు పూలే 1890 నవంబరు 28న మరణించడంతో సావిత్రీబాయి అంతులేని దుఃఖ సాగరంలో మునిగారు. ఈ దుఃఖంలో నుంచే మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టారు. తన భర్త ఫులే చితికి తానే స్వయంగా నిప్పు పెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇది. ఫులే మరణాంతరం సత్యశోధక్ సమాజ్ బాధ్యతనీ స్వీకరించి నడిపించారు. 1897 లో ప్లేగు వ్యాధి, పూణే నగరాన్ని వణికించింది. నగరమంతా ఎడారిగా మారింది. జనమంతా దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయారు. అయినా సావిత్రీబాయి కొడుకు యశ్వంత్ తో కలిసి వ్యాధిగ్రస్తులకు సేవ చేసారు.
మరణం
----------
1896-97లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని దళితులు, పేదల కోసం జోలెపట్టి విరాళాలు సేకరించి అందించారు. ప్లేగు వ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు. 1890 వ దశకంలో ప్లేగు వ్యాధి బారినపడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించారు. దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2 వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టించారు. ప్లేగు వ్యాధి సోకిన మాంగ్ లాంటి దళిత కులాలకి చెందిన దళిత చిన్నపిల్లలని తన చంకన వేసుకొని చికిత్స చేసి కాపాడారు. చివరికి ఆ ప్లేగు వ్యాధే ఆమెకి సోకి మార్చి 10, 1897 లో మరణించింది. ఆమె దత్తపుత్రుడు యశ్వంత్ అంత్యక్రియలు జరిపించాడు. సావిత్రి బాయి జయంతిని భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. 1997లో భారత ప్రభుత్వం సావిత్రిబాయి జ్ఞాపకార్థం తపాలా బిళ్ళను విడుదల చేసింది. పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పేరు పెట్టారు.
*🌹న్యూ లక్ష్య స్వచ్చంద సంస్థ 🌷*
Comments
Post a Comment