(తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ చేతిలో కీలుబొమ్మగా మారిన పోలీస్ వ్యవస్థ పై ఈరోజు (23-3-23) ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఆకునూరి మురళి ఐఏఎస్ Retd గారి వ్యాసం)
_________________________________________
#మంచికి_మనిషికి_దూరమైన_పోలీసు_వ్యవస్థ_మారేదెన్నడు?
ఒకమంచి ప్రజాస్వామ్య వనరులున్న దేశాన్ని పోలీసులు, రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు, మత ఛాందసవాదులు నాశనం పట్టిస్తున్నారు. రెండేళ్ల క్రితం మరియమ్మ అనే ఒక అమాయకురాలిని చింతకాని పోలీస్ స్టేషన్లో కొట్టి చంపారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు మరియమ్మ కొడుకు చావు కోరల అంచుకు వెళ్ళి బతికి బయటపడ్డాడు. మరియమ్మ కేసులో పోలీసులను ఉద్యోగం నుంచి తొలగించారు. కాని వారి మీద 302 సెక్షన్ ప్రకారం మర్డర్ కేసులు పెట్టలేదు. ఆ నలుగురు హంతకులూ బయట స్వేచ్ఛగా తిరుగుతూ ఉద్యోగాలు తిరిగి తెచ్చుకొనే ప్రయత్నంలో ఉండి ఉంటారు. ఏదో ఒక రోజు వాళ్ళు మళ్ళీ తిరిగి పోలీసు ఉద్యోగంలో చేరే అవకాశాలు కూడా ఎక్కువే.
ఇటీవల మెదక్ జిల్లాలో ఖాదిర్ఖాన్ అనే ఒక సామాన్యుడు పోలీస్ అదుపులో దారుణమైన థర్డ్ డిగ్రీ చిత్ర హింసలకు గురై చనిపోయాడు. థర్డ్ డిగ్రీ ప్రయోగం అంటే పోలీసులు ఇంటరాగేషన్ పేరు మీద (అంటే నిజం కక్కించడం అనే పేరు మీద) నేరస్థుడిని దారుణమైన చిత్రహింసలు పెట్టడం. 2023 సంవత్సరంలో కూడా మనం ఇలాంటి సమాజంలో నివసిస్తున్నాము అనే విషయం బాధాకరం. ఖాదిర్ ఖాన్ హత్య విషయంలో డీజీపీ స్పందించి డిపార్టుమెంటల్ ఎంక్వైరీ వేసిండు. వాళ్ళను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు. ఇప్పటికీ ఖాదిర్ ఖాన్ చనిపోవడానికి కారణమైన పోలీసులు మీద 302 సెక్షన్ ప్రకారం హత్యానేరం మోపలేదు.
ప్రభుత్వంలో పనిచేసిన నా అనుభవం ప్రకారం ఒక పౌరునిగా ఎమర్జెన్సీ రోజుల నుంచి మొన్న భూపాలపల్లి / హన్మకొండలో అరెస్టు వరకు పోలీసు వ్యవస్థను చూసిన తర్వాత నేను చెప్పదలచుకున్నదేంటంటే పోలీసుశాఖలో ఉన్నంత ఆంతరంగిక సహకారం ఇంకేశాఖలోనూ, ఏ రంగంలోనూ కూడా కనపడదు. నేరస్థులతో పనిచేయాల్సి రావడం, ఎమ్మెల్యేల స్వార్థపూరిత పనులకు సహకరించడం వలన పోలీసు శాఖ ఒక నేరపూరిత శాఖగా తయారయ్యింది.
ప్రస్తుతం తెలంగాణ మార్కు స్నేహపూరిత (ఫ్రెండ్లీ పోలీసింగ్) పోలీసు వ్యవస్థలో మనకు కనపడుతున్న లోపాలు:-
1) పోలీసు స్టేషన్కు మహిళలే కాదు మగవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు (ఇతర శాఖలవాళ్లు) కూడ ధైర్యంగా, గౌరవప్రదంగా, సౌకర్యవంతంగా వెళ్ళే పరిస్థితులు లేవు.
2) ఎఫ్ఐఆర్ (ప్రాథమిక సమాచార నివేదిక)లు సాధారణంగా రిజిస్టర్ చేసే పరిస్థితి లేదు. అది పూర్తిగా పోలీసుల దయాదాక్షిణ్యాల మీద, లంచం మీద, పై అధికారులు/ అధికార పార్టీ ఎమ్మెల్యేలు/ మంత్రుల ఒత్తిడి మీద ఆధారపడి ఉంటుంది.
3) పోలీసు స్టేషన్లలో మనుషులను కొట్టడం సర్వసాధారణం.
4) ప్రతి పోలీస్ స్టేషన్లో అనుమానితులను, చిన్నచిన్న తప్పులు చేసిన వారిని, ఎదురుతిరిగే వారిని కొట్టడానికి ప్రత్యేక కర్రలు, బెల్టులు ఉంటాయి.
5) పోలీసు స్టేషన్లలో సిసి కెమెరాలు ఉండవు. ఉన్నా పని చేయవు. పనిచేసినా కేసులలో సాక్షాలు కావాల్సినప్పుడు డిలీట్ అయిపోతాయి.
6) సబ్ ఇన్స్పెక్టర్, సీఐ, ఏఎస్పీ/డీఎస్పీల పోస్టింగులు స్థానిక అధికార ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా జరగవు. ఎస్పీ పోస్టింగులు జిల్లాకు సంబంధించిన మంత్రి ప్రమేయం, ఇంకా పై పోస్టులు ముఖ్యమంత్రి అభీష్టం మేరకు జరుగుతాయి.
7) స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే ఏమి చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉంటారు మన పోలీసులు.
8) మంచి అధికారులు అధికార పార్టీ వారికి అణిగి మణిగి ఉండలేరు కాబట్టి వాళ్ళకు లూప్లైన్ –అంటే, ట్రైనింగ్, సీసీఎస్, ట్రాఫిక్, రైల్వే పోలీసు, రిజర్వ్/ బెటాలియన్కి సంబంధించిన పోస్టులు ఇస్తుంటారు. ఈ పోస్టుల్లో అదనపు ఆదాయం రాదు. అధికారపు హంగులు ఉండవు.
9) ప్రస్తుతం ఎస్సై, సీఐ, డీఎస్పీ/ ఏసీపీ పోస్టులు లక్షలు పోసి కొనుక్కొంటున్నారు.
పెట్టుబడిగా పెట్టిన లక్షలు వెనక్కి రావడానికి వారు అవినీతి చెయ్యాల్సి వస్తుంది. ఒక ఎస్సై పోస్టింగుకి స్థానిక ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ ఇవ్వడానికి 5 నుండి 10 లక్షలు, సీఐ పోస్టింగ్కి 10 నుంచి 20 లక్షలు డీఎస్పీ పోస్టింగ్కి 10 నుండి 70 లక్షల రూపాయలు తీసుకుంటున్నారని పోలీసు వర్గాలు చెప్పుకుంటున్నాయి. పోస్టింగులే అవినీతితో మొదలు కాబట్టి ఈ ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలు రకరకాలుగా అవినీతి చెయ్యడం మొదలు పెడతారు. ఈ పరిస్థితులు 100 శాతం ఉంటాయని కాదు. కాని 90 శాతం ఇలాగే జరుగుతున్నాయి అని చెప్పడానికి సందేహించ అవసరం లేదు.
మరి ఈ పరిస్థితి మారాలంటే ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తే ఈ పరిష్కార మార్గాలు కనపడుతున్నాయి:-
1) ఎమ్మెల్యేల నుంచి, మంత్రుల నుంచి పోలీసు అధికారుల బదిలీలకు, పోస్టింగులకు సంబంధించిన సిఫారసు లేఖలను తక్షణమే ఆపాలి. అప్పుడే స్థానిక అధికార పార్టీ వాళ్ళ చెప్పుచేతల నుండి పోలీసుశాఖ బయట పడుతుంది.
2) పోలీసు స్టేషన్లలో అన్ని గదులలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిసి కెమెరాలు పెట్టాలి. వాటిని ఇంటర్నెట్ ద్వారా హైదరాబాదు సెంట్రల్ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానించి మానిటరింగ్ చెయ్యాలి.
3) ఎఫ్ఐఆర్లు ప్రజలు పోలీస్ స్టేషన్కు రాగానే రిజిస్టర్ అయ్యేట్లు చూడాలి. ఒక పౌరుడికి తన సమస్యను డైరెక్టుగా పోలీస్ స్టేషన్కు పోకుండానే రాష్ట్రంలో ఏదైనా మీ సేవ ద్వారా ఒక పిటిషన్ను దాఖలుపరచడానికి అవకాశం ఏర్పాటు చెయ్యాలి. అట్టి పిటిషన్లను మీ సేవ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ప్రింట్ కాపీని పోలీస్ స్టేషనుకు వెళ్ళి ఇస్తే ఎస్హెచ్వో దానిని ఎఫ్ఐఆర్ చెయ్యాల్సి ఉంటుంది. ఎఫ్ఐఆర్ కాకపోతే కారణాలను పరిస్థితులను పిటిషన్కు సంబంధించి ఆన్లైన్ సాఫ్ట్వేర్లో నమోదు చెయ్యాలి. ఈ పూర్తి వ్యవస్థను ఎస్పీలు మానిటరింగ్ చేసే యంత్రాంగం పెట్టాలి. అలాగే ఎఫ్ఐఆర్లు ఆన్లైన్లో పోలీసు శాఖ వెబ్సైట్లో సులభంగా దొరికేటట్లు ఉండాలి.
4) ప్రతి పోలీసు, పోలీసు అధికారి తప్పకుండా యూనిఫాం వేసుకోవాలి. ప్రతి పోలీసు షర్ట్ మీద నల్లబాడ్జి తెల్ల అక్షరాలతో పేరు కనబడేటట్లు ధరించాలి. ప్రజలకు పేరు తెలిస్తే స్నేహపూరితంగా లేకపోయినట్లయితే తరువాత ఆ అధికారి మీద మీ సేవలో ఫిర్యాదు చేసేటట్లు / ఫీడ్ బ్యాక్ ఇచ్చేటట్లు వ్యవస్థను పెట్టాలి.
5) రిజిస్టర్ అయిన ప్రతి ఎఫ్ఐఆర్కు సంబంధించి కోర్టుకు ప్రతిపాదించే చార్జ్షీట్ 30 రోజులలో వేసేటట్లు పోలీసు స్టేషన్లను ఆధునీకరించాలి.
6) క్రింది స్థాయి ప్రతి పోలీసు అధికారి రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేసేటట్లుగా, పోలీసుశాఖ సిబ్బందిని అవసరం అనుకుంటే పెంచాలి.
7) రాష్ట్రంలో 841 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ప్రతి పోలీసు స్టేషన్కు ర్యాంకింగ్ ఇవ్వాలి. పోలీసు స్టేషన్కు ముందు ఆ స్టేషన్ రాష్ట్రంలో ఏ ర్యాంకింగ్లో ఉంది. జిల్లాలో ఏ ర్యాంకింగ్ ఉందో ఆ నెంబర్ను పెద్ద అక్షరాలతో పెయింటింగ్ వెయ్యాలి.
8) పోలీస్ స్టేషన్కు ర్యాకింగ్ ఇచ్చే ప్రమాణాలలో ఎఫ్ఐఆర్ల సంఖ్య, నేరాల సంఖ్యను ప్రామాణికంగా తీసుకోకూడదు. దీని వలన కూడా పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం లేదు. ర్యాంకింగ్ ఇచ్చే ప్రమాణాలలో స్నేహపూర్వక ప్రవర్తన మీద ప్రజలు ఇచ్చే అభిప్రాయాలకు 40 శాతం వెయిటేజి ఉండాలి. ఈ ఫీడ్ బ్యాక్ అభిప్రాయాలను వేరే సంస్థ (థర్డ్ పార్టీ)ల ద్వారా సేకరించాలి.
9) నేరపూరిత పోలీసుల మీద ఐపీసీ/ సీపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తేనే పోలీసులలో నేరపూరిత స్వభావము తగ్గుతుంది. ఇలాంటి కేసులను విచారించడానికి ఒక స్వతంత్ర సంస్థను రాష్ట్ర మానవ హక్కుల సంస్థ కింద పనిచేసేటట్లుగా ఏర్పాటు చేయాలి.
10) పోలీసు అధికారుల ఆస్తిపాస్తులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఎప్పటికపుడు పర్యవేక్షించాలి.
11) స్నేహపూరిత పోలీసింగ్ను పెంపొందించడానికి పోలీసులకు తగిన శిక్షణలు ఇప్పించాలి.
12) థర్డ్ డిగ్రీ పద్ధతులు అవలంబించకుండా చర్యలు తీసుకుంటూ కేసుల పరిశోధనలో కొత్తకొత్త సాంకేతిక పద్ధతులు అవలంబించేటట్లు శిక్షణలు ఇవ్వాలి.
13) పోలీసు స్టేషన్లలో వచ్చే పౌరులకు డిగ్నీటికి సంబంధించి, సిబ్బందికి సంబంధించిన కావాల్సిన మౌలిక సదుపాయాలను, ఫర్నీచర్ను ఇచ్చి పోలీస్ స్టేషన్లను నవీకరించాలి.
14) హోం శాఖ మంత్రి, డీజీపీలు, ఐజీపీలు, డీఐజీలు ఆకస్మిక తనిఖీలు చేసే ఒక పటిష్టమైన వ్యవస్థను నెలకొల్పాలి.
ప్రజలకు దైనందిన జీవితంలో పోలీసుశాఖ చాలా ముఖ్యమైనది. ఆ శాఖను ప్రజలకు చేరువ చేయటానికి, స్నేహపూరిత పోలీసింగ్ చేయటానికి, శాఖలో అవినీతిని అరికట్టడానికి ప్రభుత్వం, పోలీసు శాఖ సీరియస్గా చేయవలసిన పని చాలా ఉంది.
- #ఆకునూరి_మురళి, ఐఏఎస్ (రిటైర్డ్)
కన్వీనర్, ఎస్డిఎఫ్
Comments
Post a Comment