Aug 11,2023 07:29
పురాణాలలో ఉంది అంటే జనం లోగడ ప్రతిదీ నమ్మేవారు. ఈ ఆధునిక కాలంలో ట్రెండ్ మారింది. సైన్స్ అని చెపితేనే నమ్ముతున్నారు. అందువల్ల ప్రతి విషయంలో లేని సైన్స్ను మనువాదులు బయటికి తీస్తున్నారు. దాన్ని చూపుతూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. అసలైతే సైన్స్ అని చెప్పినప్పుడు రుజువులు, నిరూపణలూ కావాలి! పిట్టకథలు చెప్పినట్లు చెపితే కుదరదు.
1. మనువాదులు ప్రచారం చేస్తున్న కొన్ని సూడోసైన్స్ విషయాలు చూద్దాం... దేవాలయాల్లో భక్తులు గంట కొట్టిన తరువాత ఆ గంట కింద మూడు నిముషాలు నిలబడితే శరీరంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని, మనసు ప్రశాంతంగా ఉంటుందని, అందులో ఎంతో సైన్స్ ఉందని బ్రాహ్మణిజం ప్రచారం చేస్తోంది. గంటలు మామూలు ఇత్తడితో కాకుండా, ఇతర లోహాలు కూడా కలిపి, ఒక లోహ మిశ్రమంతో వాటిని తయారు చేస్తారు. ఈ గంటలు తయారు చేసేవారిని 'ఘంటాసాజ్' అని పిలుస్తారు. గంట కొట్టిన తర్వాత అది రెండు నిముషాల యాభై అయిదు సెకన్లపాటు ప్రకంపనల్ని విడుదల చేయాలంటే - అలా చేసే విధంగా ఈ గంటల కార్మికులు లోహాల నిష్పత్తిని ఏర్పాటు చేసుకుంటారని, అందుకు కొంత సాంకేతిక పరిజ్ఞానం అవసరమనీ చెపుతారు. ఇవన్నీ నిజమే కానీ... ఆ ప్రకంపనలు ఆగిపోయే వరకు ఆ గంట కిందే నిలబడితే వెలువడే ఎనర్జీకి కొలమానం లేదు. వెలువడుతుందన్న దానికి రుజువు లేదు. ఆ పాజిటివ్ ఎనర్జీ శరీరానికి ఏవిధంగా ఉపయోగపడుతుందీ అన్నదానికీ నిరూపణ లేదు. గుడులకు భక్తులు తగ్గిపోతున్నారనీ, ఆ వచ్చిన కొందరు గుళ్ళలోంచి త్వరత్వరగా వెళ్ళిపోతున్నారని బ్రాహ్మణవాదులకు భయం పట్టుకున్నట్టుగా ఉంది. అంతే! అలాంటి ప్రకంపనాల ప్రభావం శరీరం మీద ఎలా ఉంది? మానసికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఎలాంటి మేలు జరుగుతుంది- అనేది ప్రాయోగికంగా చూపాలి. చూపలేకపోతే అది ఉట్టి గ్యాసే...
2. అలాంటిదే ఆరా గురించి ఓ కథ అల్లి ప్రచారం చేస్తున్నారు. 'ఆరా' అంటే మనిషి తల చుట్టూ ఉంటుందని భావించే కాంతి పుంజం - తేజస్సు. చిత్రాలలో హిందూ దేవతల తలల చుట్టూ గుండ్రంగా కాంతి పుంజం - వెలుగు ఉన్నట్టు చిత్రకారులు చిత్రిస్తారు. అదే ఆరా. అలాంటి ఆరా మనుషులకు కూడా ఉంటుందని మైసూరు దత్తపీఠం దత్త విజయానంద తీర్థ స్వామీజీ ఒక వీడియోలో సందేశం ఇచ్చారు. విదేశీయులతో కలిసి ఓ ఇరవై మందిని తీసుకుని ఆయన గోశాల దగ్గరికి వెళ్ళారట. వీరితో పాటు ఒక డాక్టర్ను ఒక సైంటిస్టును కూడా తీసుకుని వెళ్ళారట. వీళ్ళు ఆరాను కొలిచే పరికరాలు కూడా తీసుకుని వెళ్ళారట. విషయమేమంటే మొదట పరీక్షించినప్పుడు ఆరా లేని వాళ్ళకు, గోప్రదక్షిణ చేసి రాగానే ఆరా పెరిగిందట. దేశీయ గోవుల ప్రదక్షిణ హిందూ ధర్మానికి అవసరం అని ఆయన చెప్పారు. గోపూజ, గో సన్నిధి, గో ప్రదక్షిణ, గో సంరక్షణను ప్రమోట్ చేయడం కోసం ఆ స్వాములు అల్లిన కట్టుకథ అని తెలుస్తూనే ఉంది.
ఆధ్యాత్మికత, అనుష్టానం వంటి బ్రాహ్మణిజానికి సంబంధించిన గాలి కబుర్లు చెప్పి జనాన్ని మోసం చేయడం తప్ప, వీరు, వీరి ఆరా, గోప్రదిక్షణ వాస్తవంగా దేనికి ఉపయోగమో రుజువు చేయాలి. ఇందులో డాక్టరు, సైంటిస్టుల ప్రసక్తి తెచ్చారు. ఎందుకంటే సైన్సు - సాంకేతిక పరికరాలూ అంటేనే జనం నమ్ముతారు గనక! ఊరికే చెప్పడం వల్ల లాభం లేదు. ఆ వీడియోలోనే ఆరాను ఎలా కొలిచారో కూడా చూపించాల్సింది. ఆ ఆరా ఎవరికి ఏ విధంగా ఉపయోగపడిందో కూడా ప్రత్యక్షంగా జనానికి చూపించాల్సింది కదా? ఇలా సైన్సు పేరును తమ అంధ విశ్వాసాల వ్యాప్తికి వాడుకోవడం దుర్మార్గమైన పని. వివేకమున్న అధికారులు, ప్రభుత్వాధినేతలు ఉంటే... ఇలాంటి వారిని సత్వరమే అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవారు. కానీ, ఈ దేశంలో అలాంటి పని జరగదు. ఎందుకంటే ప్రభుత్వాలే గుడ్డి నమ్మకాల్లో కళ్ళు మూసుకుని ఉన్నాయి కాబట్టి! గుళ్ళు గోపురాల కట్టడాలకు ప్రజాధనం వృధా చేస్తుంటాయి కాబట్టి! కనిపించే ప్రజల అవసరాల కంటే, వీరికి కనపడని దేవుడికి కట్టడాలు కట్టడం కావాలి కాబట్టి! శతాబ్దాలుగా యజ్ఞయాగాల పేరుతో గోవుల్ని బలి ఇచ్చిన విషయం చెప్పుకోరెందుకూ? తమ పూర్వీకులు చేసిన తప్పిదాల గూర్చి విచారించరెందుకూ? మనోభావాలు దెబ్బతిన్నాయని గగ్గోలు పెట్టే మూర్ఖులంతా తమ మనోభావాలు తక్షణం మార్చుకోవాలి. ఎందుకంటే వాస్తవాలు, నిజాలు ఎప్పుడూ అలాగే ఉంటాయి.
3. ఒక పరిశోధనా సంస్థ బయట కొందరు బ్రాహ్మణార్యులు తచ్చాడుతూ కనిపించారు. గేటు దగ్గర సెక్యూరిటీ వాళ్ళకు మాయమాటలు చెప్పి - లోపలికి వెళ్ళి వరండాలో కూర్చున్నారు. వాళ్ళను గమనించిన ఓ పరిశోధకుడు 'పాపం! ఏమిటో వీరి బాధ' అనుకుని మాట్లాడించాడు.
'ఏమిటండీ! మీరు ఎవరిని కలవాలి?' అని అడిగాడు.
''అబ్బే ఏం లేదండి. లోపల మనవాళ్ళు పరిశోధనలు చేస్తున్నారు కదండీ! వారేదైనా విషయం కనిపెట్టి ప్రకటించగానే-మేం వెళ్ళి మన పురాణాల్ని తిరగేస్తామండీ అంతే!'' అన్నాడు.
'అంతేనా? అంతకన్నా మీరు ఎక్కువే చేస్తారు! ఎన్నిసార్లు చూడలేదూ? ఇప్పుడిక్కడ మేం కనిపెట్టింది చెపితే - అది తీసుకుని మీరు బయటికి వెళతారు. ఫలానా అంశం మా పూర్వీకులు మా పురాణాలలో ఎప్పుడో రాసిపెట్టారు అని టముకు వేస్తారు.'
ఔన్నత్యం పూర్వకాలం నుండి ఎలా ఉందో - అది చెపుతామన్నమాట!''
'చెపుతారు. బాగానే ఉంది గానీ, మేం వైజ్ఞానికంగా కనుగొని చెప్పిన దానికీ, మీరు ఉత్తుత్తిగా పుట్టించి చెప్పిన దానికి పొంతన ఉండదు. మీరు చెప్పేదానికి సరైన వివరణలు, రుజువులూ ఉండవు. ఇంకా ఎందుకు వృధా ప్రయాస ?
''వృధా ప్రయాస ఎలా అవుతుందండీ? మమ్మల్ని నమ్మేవాళ్ళు కూడా దేశవ్యాప్తంగా ఉన్నారు. మీరు చెప్పేది అర్థం చేసుకోవాలంటే ఆ విషయంలో కొంత పరిజ్ఞానం ఉండాలి. మేం చెప్పేది నమ్మాలంటే ఏదీ అవసరం లేదు. చెప్పింది చెప్పినట్టు గుడ్డిగా నమ్మితే చాలు. అయినా బాగోగులు ఆలోచించి చెప్పడానికి మేం ఉన్నాం గదండీ? సామాన్యులు ఎందుకండీ ఆలోచించడం?''
'చాలు.. చాలు... దేశానికి మీరు చేసిన నష్టం చాలా ఉంది. మీరేం చెప్పినా ఏ పురాణం ప్రసక్తి తెచ్చినా జనం ఎవరూ నమ్మరు. రుజువులు, సాక్ష్యాలు చూపితేనే నమ్ముతారు. మా పరిశోధనకు అన్ని ఆధారాలు, రుజువులూ ఉన్నాయి కాబట్టి, ప్రజలు నమ్ముతున్నారు. వారికి మా మీద విశ్వాసం ఉంది. మూఢ విశ్వాసాలు వ్యాప్తి చేసే మీ మీదేలేదు. మేం ఏం కనిపెడతామో కనుక్కుని, దాన్ని మీ ఖాతాలో అక్రమంగా వేసుకోవాలని 'గోతికాడి నక్కల్లాగ' మీరు ఎదురు చూస్తున్నారు. వెళ్ళండి బయటికి - పొరపాటున కూడా మిమ్మల్ని లోపలకి రానివ్వొద్దని మా సెక్యూరిటీ డిపార్టుమెంటు వారికి గట్టిగా చెపుతాను.
''అయ్యా! అంత పని చేయకండయ్యా ...
'స్వంత బుర్రలేదు. స్వంత ఆలోచన లేదు. అన్నీ ఇతరుల నుండి కాపీ కొట్టి గొప్పలు చెప్పుకోవడమే కదా మీరు చేసే పనీ? జనం ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ సొళ్ళు కబుర్లు పిచ్చివాగుడూ ఎవరు వింటారూ? వినిప ిస్తోందా? పదండి! మళ్ళీ రాకండి!! చెపుతున్నది మీకే - మీ అబద్దాల ఫ్యాక్టరీ ఇక బంద్!'
4. సైన్స్ చుట్టూ, సైన్స్ పరిశోధనా సంస్థల చుట్టూ తిరిగిన ఒక విష ప్రచారం ఇలా ఉంది. శ్రీహరికోట లోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 ...2023 జులై 14వ తేదీన సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి దిగ్విజయంగా ప్రయోగించబడింది. అది 23 ఆగస్టు 2023న అంటే 40 రోజుల తర్వాత చంద్రుడి మీదికి చేరుతుందని అంచనా. ఇది వాస్తవం! కానీ, దీని ఆధారంగా వారం రోజులకే అంటే 20 జులై నాటికే చంద్రయాన్పై మనువాద బ్రాహ్మణిజ కాషాయ మూకలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. అదేమిటంటే... అంతరిక్ష నౌక చంద్రుడి మీదికి చేరినట్టూ, అక్కడి నుండి అది కొన్ని ఫొటోలు పంపినట్టు (మార్ఫింగ్ చేసిన) ఆ ఫొటోలో కొద్ది దూరంలో ఒక హిందూ దేవాలయం కనిపించినట్టూ పోస్ట్లు సృష్టించారు. ''చంద్రుడిపై హిందువుల గుడి-చంద్రయాన్-3 నుండి విడుదలైన ఫొటో'' అని దానికి హెడ్డింగ్ కూడా! ఆ పోస్ట్ కింద జైశ్రీరామ్ అనీ, ఇది హిందువుల పవర్ అని కొందరు కామెంట్లు కూడా రాశారు. హిందువులే కాదు, దేశమే తలదించుకునేంత ఫేక్ ఫొటోల ప్రదర్శన అవసరమా? వీళ్ళు ఈ సమాజాన్ని ఎటు తీసుకుపోతున్నారోనని భయంగా ఉంది. ముఖ్యంగా యువతీ యువకులు ఇలాంటి అసత్యాల్ని గుర్తుపట్టి జాగ్రత్తగా ఉండటంతో పాటు, ఎండగడుతూ ఉండటం అవసరం!
/వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్ /
డా|| దేవరాజు మహారాజు
Comments
Post a Comment