Chiranjevulu T, IAS Telangana
ఈ దేశంలో వేల సంవత్సరాలుగా అణగదొక్కబడిన బిసి వర్గాలు తాము అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతామని ,అగ్రవర్ణాలతో పోటీపడే సమాన అవకాశాలు లభిస్తాయని, తమ జనాభా దామాషా ప్రకారం న్యాయబద్ధమైన వాటా లభిస్తుందని ఆశించారు. స్వాతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత విద్య, ఉద్యోగాలు ,స్థానిక సంస్థలలో కాస్తా రిజర్వేషన్లు కల్పించడంతో కొంత మేరకు లబ్ధి చేకూరినప్పటికిని చట్టసభలలో రిజర్వేషన్లు లేకపోవడం వలన వారి ప్రాతినిధ్యం నామమాత్రంగా మారింది. ఈ దేశ పరిపాలనలో వారు భాగస్వాములు కాలేకపోతున్నారు. ఎస్సీ మరియు ఎస్టీలకు వారు జనాభా దామాషా ప్రకారం చట్టసభలలో రిజర్వేషన్లు ఉండడం వలన వారి ప్రాతినిధ్యం కొంతవరకైనా మెరుగుగా ఉంది. జనరల్ సీట్లలో వారు పోటీ చేసి గెలిచిన సీట్లు చాలా తక్కువ.
అనాదిగా అగ్రవర్ణాలు వివిధ ధర్మాల ,వాదాల పేరిట సామాజిక న్యాయమును సమాధి చేశారు. మెజారిటీ ప్రజల జీవితాలను బానిస బ్రతుకులుగా మార్చినారు. సంపద ,రాజకీయ అధికారం ఆధిపత్య అగ్రవర్ణాల వారి చేతుల్లో ఉండటం వలన బిసిలు బానిస సంకేళ్ళు తెంపుకోలేక పోతున్నారు. చట్టసభలలో నామమాత్రంగా మిగిలిపోతున్నారు. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో 1952 నుంచి 2023 వరకు 16 సార్లు శాసనసభకు ఎన్నికలు జరగగా ప్రతిసారి బిసిలు నామ మాత్రం ఉనికినే చాటుకున్నారు. ఐదు శాతం జనాభా లేని అగ్ర కులాలు 50 శాతం పైగా సీట్లు సాధిస్తున్నారు. ఈ క్రింది పట్టికను గమనించినట్లయితే బిసిల రాజకీయ ప్రాతినిధ్యం తేటతెల్లమవుతుంది.
టేబుల్ ఒకటి
పై లెక్కలు చూసినట్లయితే జనాభాలో 60% ఉన్న బిసిలు 1952అసెంబ్లీలో 9 మందినుంచి 2023 కు 19 కి నామ మాత్రముగా పెరిగినారు. 1978లో అత్యధికంగా 27 మంది బిసి ఎమ్మెల్యేలు ఉండగా, ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం హవాలో 1983లో 15కు, 1985లో 14 పడిపోయినారు. ప్రస్తుత అసెంబ్లీలో 16% అనగా 19 మంది ఉన్నారు. దీనిని బట్టి తెలిసింది ఏమిటంటే బిసిల లో ఇంకా రాజకీయ చైతన్యం రాలేదు . బానిస మనస్తత్వం తో నే ఉన్నారు.
1983 తర్వాత రాజకీయాలలో 3 ఎం ల పాత్ర పెరగటమే ప్రధాన కారణము. (మనీ పవరు,మజిల్ పవర్, మీడియా పవర్, ) ఇది బిసిల పాలిట శాపముగా మారినది.
రెండవ పట్టిక
అదేవిధంగా బిసి కులాలలో ఏ ఏ కులాలు అసెంబ్లీకి తమ ప్రతినిధులను రెగ్యులర్గా పంపాయని పై పట్టికను సునిశితంగా పరిశీలిస్తే అవి కేవలం ఐదు కులాలే . అవి మున్నూరు కాపు, గౌడ, యాదవ, ముదిరాజ్, పద్మశాలీలు. ఇక శాసనసభకు అడపాదడపా ఎమ్మెల్యేలను పంపిన కులాలు లింగాయత్, రజక, పెరిక, విశ్వకర్మ, కురుమ, గంగపుత్ర, వంజర, బోయ, లోద క్షత్రియ లేదా బొందిలి, ఖత్రి, సగర, సేవక, ఆరె మరాఠీ, మొదలైనవి. బిసిలలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 136 కులాలు ఉండగా అందులో సుమారు 120 కులాలు నేటికి తమ నేతలను శాసనసభకు పంప లేక పోయారు.
మూడు లక్షలకు పైబడి జనాభా ఉన్న నాయి బ్రాహ్మణులు (మంగలి) శాలివాహనులు (కుమ్మరి) ,వడ్డెరలు ఈ 77 ఏళ్ల స్వాతంత్ర పాలనలో ఒక్క సభ్యుని కూడా శాసనసభకు పంపలేకపోయారు. నాయి బ్రాహ్మణుడు అయినా భారతరత్న శ్రీ కర్పూరి ఠాకూర్ ,బీహార్ లో ముఖ్యమంత్రిగా పనిచేసి జననాయకుడైనారు. ప్రక్కనున్న తమిళనాడులో నాయి బ్రాహ్మణులు ముఖ్యమంత్రులుగా ఏలుతుంటే ఇక్కడ ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. కేవలం ఒక లక్ష జనాభా ఉన్న ఒక అగ్రకులం అసెంబ్లీలో ప్రతిసారి ఐదు నుండి ఏడు శాతం సీట్లు సంపాదిస్తుంది. అలాగే మూడు శాతం జనాభా ఉన్న ఇంకో అగ్ర కులం 33% సీట్లు సాధిస్తుంది. 60% జనాభా ఉన్న బి.సి. లు ఎక్కడో మూలన పడి ఉంటున్నారు 10 నుంచి 20% మించకుండా. ఇది ఎక్కడి సామాజిక న్యాయం ,ఇదెక్కడి ప్రజాస్వామ్య పాలన?
తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు బిసిలు ముందుండి పోరాటం సాగించారు. వచ్చిన తెలంగాణలో సామాజిక న్యాయం అందరికీ అందుతుందని ఆశపడినారు .కానీ మరల దొరల పాలన వచ్చి దగా పడినారు. 2009లో 23 మంది బిసి శాసనసభ సభ్యులు ఉంటే 2014లో 20, 2023లో 19కి పడి పోయినారు.ఇదే ధోరణి కొనసాగితే వీరి ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీదు మిక్కిలి 2029 నుంచి చట్టసభలలో మహిళా రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయి .అందులో బిసి మహిళలకు రిజర్వేషన్లు లేవు. బీసీల శాతం మరింత తగ్గుతుంది .ఇది మూలిగే నక్కపై తాటిపండు పడిన చందం లాగా ఉంది. ఈ మధ్యకాలంలో చాలామంది బీసీలు రక రకాల భావజలం లో కొట్టుకొని పోతూ తమకు జరుగుతున్న అన్యాయాలని తాము గుర్తించలేక పోతున్నారు . ఏ వర్గాలు అణిచివేస్తున్నారో ఆ వర్గాల జెండాలే మోస్తున్నారు .ఇంకా బీసీలను ఎవరు రక్షించాలి?అన్ని రాజకీయ పార్టీలు బి.సి. లను ఓట్ బ్యాంకు గా వాడుకొని వదిలేసినవే.ఎ ఒక్కరికి బిసిల అభివృద్ధి పై చిత్తశుద్దిలేదనేది అక్షర సత్యం.
ఇప్పటికైనా బిసిలు వాస్తవాలు తెలుసుకోవాలి, కళ్ళు తెరవాలి. చదువుకున్న వారు,ఆర్థికం గా భాగ ఉన్నవారు రాజకీయాలలోకి రావాలి. రాజ్యాధికార కాంక్ష పెంచు కోవాలి.అగ్రవర్ణాలు పన్నుతున్న కుట్రలను త్రిప్పి కొట్టాలి . చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు లేవు .కాబట్టి ఒక బీసీ కులం ఇంకో బీసీ కులమును డామినేట్ చేస్తుందని భావన నుంచి బయటకు వచ్చి అందరు సంఘటితమై ఉద్యమించాలి. ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి చట్టసభలలో రిజర్వేషన్లు సాధించాలి. అప్పుడే బీసీలు రాజ్యాధికారం పొందగలుగుతారు. బిసిలలో ఉన్న అత్యంత వెనుకబడిన వర్గాలు కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి. బిసిల రాజకీయ వెనుకబాటు తనంను తేటతెల్లం అయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కుల గణన చేపట్టాలి. బిసిలలో కూడా సబ్ క్యాటగిరీలు చేసి వారు కూడా రాజ్యాధికారంలో పాలుపంచుకునేలా రిజర్వేషన్లు అమలు చేయాలి. అప్పుడే సామాజిక న్యాయం అట్టడుగు వర్గాలకు అందుతుంది
ప్రజాస్వామ్యం అంటే ఒక రెండు ,మూడు కులాల పాలన కాదు. ఇది ప్రజలందరి పాలన. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు "రాజ్యాధికారమే సామాజిక ప్రగతికి తాళం చెవి" బిసిలు గుర్తించాల్సిందేంటంటే రాజ్యాధికారం లేనిది సామాజిక న్యాయం సాధ్యం కాదు .అందుకే విభేదాలు పక్కన పెట్టి కులాలు వేరైనా మనమందరం ఒకటే,బిసిలమనే నినాదంతో ఐక్యంగా ఉద్యమించాలి, రాజ్యాధికారం చేపట్టాలి, పాలకులమని నిరూపించాలి, ప్రజాస్వామ్యమును పరిరక్షించాలి.
Comments
Post a Comment