"హిస్సా ,ఇజ్జత్ - హుకుమత్- ‘’
(వాటా,ఆత్మ గౌరవం,అధికారం )ఇవే బిసి ఉద్యమ నినాదాలు.
T.చిరంజీవులు ఐఏఎస్ (retd)
అధ్యక్షులు బిసి ఇంటెలెక్చువల్స్ ఫోరమ్
“భరతావని “అనే కవితలో ప్రముఖ తెలంగాణ కవి అలిశెట్టి ప్రభాకర్ గారు “ఎన్ని భవనాలకు ఆభరణాలు తొడిగిన ,హరిత విప్లవాలే కప్పిన ,ఆస్తిపంజరమే భరతావని ,ఆర్తనాధమే వర్తమానం “అన్నారు.నిజమే నేడు భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినప్పటికిని సామాన్యుని వార్షిక తలసరి ఆదాయం 30 వేల నుంచి 40 వేలకు మించి లేదు సంపదలన్నీ కొందరు చేతిలోనే కేంద్రీకృతమైనాయి .తినడానికి తిండి లేక బీసీలు ఎస్సీ ఎస్టీల బతుకులు దుర్భరమైనటువంటి పరిస్థితులు.
ఇక్కడ రాజ్యాధికారానికి తోడు వర్ణ వ్యవస్థలు, కుల వ్యవస్థలు తోడై శూద్రులను,అతి శూద్రులను శారీరకంగా, మానసికముగా, ఆర్థికముగా, సాంస్కృతికముగ ,రాజకీయము గ బానిసలుగా చేసి ,క్రూరంగా అణిచి వేసి సర్వ విధాలుగా నాశనం చేశారు. భారత రాజ్యాంగము అమలులోకి వచ్చి 75సంవత్సరములు గడిచి నప్పటికిని నేటికి బిసిల జీవితాల్లో సామాజిక మార్పులు పెద్దగా ఏమి జరగ లేదు. నేటికి సామాజిక న్యాయం అందని ద్రాక్షపండే:
స్వతంత్ర భారతములో బిసిలు అనగా నాటి శూద్రులు జనాభాలో 60% ఉన్నప్పటికిని నేటికి అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారు. .బిసి లు మెజారిటీ ప్రజలైనప్పటికిని రాజ్యాదికారములో భాగస్వాములుగాక యాచకులుగా మిగిలిపోయారు. అగ్రవర్ణాల వలే బిసిలకు సామాజిక హోదా,ఆర్థిక బలం, రాజకీయ అండ లేదు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ వలె రాజ్యాంగ రక్షణలు లేవు. బిసిలు మద్యస్థంగా ఉండి ఎటు ఎదగలేక నానా అవస్థలు పడుతున్నారు.
ఈ దురవస్థకు ముగింపు పలకాలిన్సిందే. అందుకే నేడు బిసి వాదం తెరపైకి వచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో నేడు బిసి వాదము ప్రకంపనలు సృష్టిస్తోంది .బిసి వాదానికి ముఖ్యమైన కారణం తెలంగాణ రాష్ట్రంలో బిసిలు అన్ని రంగాల్లో అనగద్రొక్కబడడమే, వెనుకకు నెట్టి వేయ బడటమే.అణచి వేత నుంచి ఉద్యమాలు ఉద్భవిస్తాయనేది చారిత్రక సత్యం.
బిసి వాదం ముఖ్యంగా మూడు అంశాల తో ముడి పడి ఉంది. అవి అస్తిత్వం, ఆత్మగౌరవం, అభివృద్ధి.
బీసీ ల అస్తిత్వం—ఇది దేశము లోని చారిత్రక,సామాజిక, ఆర్థిక, మరియు రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంది
అ.)బిసిల అస్తిత్వపు సామాజిక చారిత్రక నేపథ్యం-
భారతీయ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ సమాజంలో కులాలు వృత్తిపరంగా, విభజించబడ్డాయి.చారిత్రకము గా చాలా కులాలు విద్య కు నోచు కొక సామాజికంగా వెనుక బడ్డాయి.బ్రాహ్మణీయ మనువాద శాస్త్రాలు శూద్రులు విద్యకు అనర్హులని సామాజికం గా విద్యకు దూరం చేసింది.అదేవిధంగా ఈ బ్రాహ్మణియ మనువాదానికి రాజ్యం ఆమోదం ఉండడంతో దళితుల శూద్రుల బతుకులు అద:పాతాళానికి తొక్క బడ్డాయి.
స్వాతంత్ర్యఅనంతరం రాజ్యాంగము లో బిసి లు సామాజికంగా,విద్యాపరంగా వెనుక బడిన తరగతులుగా పేర్కొన బడినారు.విద్యా,ఉద్యోగాలలో రిజర్వేషన్ లు కల్పించ బడినవి కానీ కేంద్రంలో 1993 వరకుఉద్యోగాలలో అలాగే రాష్ట్రంలో 1973 వరకు విద్యా ఉద్యోగాలలో బీసీలకు రిజర్వేషన్లు అందలేదు .ఫలితంగా బీసీలు స్వాతంత్రం వచ్చిన కొత్తలో సృష్టించబడిన అనేక ఉద్యోగాలు పొంద లేక పోయారు.ఈనాటికి కూడా బీసీలు 27% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో లేరు వారి శాతం 23% మాత్రమే.కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ ల లొ 2008వరకు కూడా రిజర్వేషన్లు కల్పించబడలేదు. తద్వార సామాజిక న్యాయం అనేది నేటికీ వారికి అందరి ద్రాక్ష పండే .ఏవియును చిత్త శుద్ధి తో అమలు కాలేవు.బిసిలు ఇప్పటికీ సామాజికంగా వివక్షను ఎదుర్కొంటున్నారు. అగ్ర వర్ణాల దోపిడీకి, అణిచివేతకు గురవుతున్నారు.
కొన్ని రాష్ట్రాల్లో బిసిల ప్రాముఖ్యత పెరుగుతున్నప్పటికీ, సమాజంలో పూర్తి సమానత్వం ఇంకా సాధించబడలేదు. మెజారిటీ ప్రజలు ఇంకా చాలా వెనుకబడి దైన్య స్థితి లొ ఉన్నారు.
ఆ)ఆర్తిక రంగం —మన మను అధర్మశాస్త్రాలు శూద్రులకు ఆస్తి ఉండకూడదని బోధించాయి.శూద్రులు మిగతా మూడు వర్ణాలకు సేవకులని తేల్చాయి తద్వారా బీసీలు కేవలము శ్రమ శక్తి పై ఆధారపడి బతికే వర్గాలుగా మారిపోయారు. స్వాతంత్ర్యానంతరం పరిశ్రమలు ,వ్యాపారాలు,స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతున్నా వారి వాటా నామ మాత్రమే.మెజారిటీ పరిశ్రమలు,వ్యాపారాలు రాజకీయ అండతో అగ్ర వర్ణ,అధిపత్య కులాలోచేతి లోకి వెళ్లి పోయాయి.మెజారిటీ బీసీ లు సాంప్రదాయ కులవృత్తులు కోల్పోయి దినసరి కూలీలుగా మారారు.ఆత్మ హత్యలు నిత్య కృత్య మయ్యాయి.
బిసి లలో కొన్ని వర్గాలు ఆర్థికంగా ఎదిగినా,చాలామంది బిసిలు దయనీయ స్థితిలో జీవిస్తున్నారు.
ఇ)సాంస్కృతికపరంగా ప్రతి బిసి కులానికి ఒక ప్రత్యేక మైన సంస్కృతి ఉంది.
బిసి లు అనేవారు సజాతీయ సమూహం కాదు.భిన్న వృత్తుల సమాహారం.గత 77 ఏళ్లుగా జరిగినటువంటి పారిశ్రామికరణ ,ప్రపంచీకరణ ,సాంకేతిక పురోభివృద్ధి వలన వీరి వృత్తులు నాశనమైనాయి .వీరి కళాత్మక జీవన విధానం.సాంస్కృతిక సౌందర్యం దెబ్బ తింది.శ్రమ,పెట్టుబడి,ఉత్పత్తి సంబంధాలు మారిపోయినవి .తద్వారా వారు సుదూర పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లి తమ సాంప్రదాయ కుల వృత్తులను వదులుకొని కూలి నాలి చేసుకొని బతకాల్సినటువంటి దుర్బర పరిస్థితుల్లోకి నెట్టి వేయబడ్డారు. నవీన జీవన విధానం కు అలవాటు పడ్డారు.ఉమ్మడి కుటుంబ వ్యవస్థ,సామూహిక జీవనం దెబ్బ తిన్నవి.సాంస్కృతిక విధ్వంసం జరిగింది.ఆధునిక వ్యవస్థ లొ ఇమడ లేక ఇబ్బంది పడుతున్నారు.
ఇ)రాజకీయంగా
కొన్ని రాష్ట్రాలలో బిసి నాయకులు ముఖ్యమైన హోదాల్లో ఉన్నారు. కాని మన తెలుగు రాష్ట్రాలలో ఏనాడు వీరికి తగు ప్రాధాన్యత లభించలేదు.
నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధాన చట్ట సభలైన లోక సభలో గానీ, రాష్ట్ర శాసనసభలో గాని బిసిల ప్రాతినిధ్యం నామమాత్రమే. అగ్రవర్ణ అధిపత్య కులాల ఆధ్వర్యము లొ ఉన్న రాజకీయ పార్టీల జెండా ,ఎజెండా లను మోసే కూలీలుగా మారిపోయారు. పదవుల కోసం యాచకులు గా దిగ జారి పోయారు.బిసి కులాల మధ్య ఐక్యమత్యం లేదు ,అలాగే కులము లో గూడ లేక పార్టీల వారిగా చీలి పోయారు. వారికి వ్యక్తిత్వము, అస్తిత్వము లేకుండా పోయింది. కోల్పోయిన ఈ అస్తిత్వాన్ని తిరిగి పొందాలంటే వారికి సైద్ధాంతిక భావ జాల పునాది చాలా అవసరం. వారిలో ఈ సిద్ధాంతాలతో ఆత్మవిశ్వాసం నింపాల్సిన అవసరముంది. బానిస మనస్తత్వం పారదోలాలి.ప్రశ్నించే తత్వాన్ని బోధించాలి.ఆత్మన్యూనత భావం పోగొట్టాలి.అందుకే వారికి పూలే, అంబేడ్కర్, కాన్షిరాం సిద్ధాంతలను, భావాలను నూరి పోయాలి.చత్రపతి శివాజీ మహారాజ్, సాహూ మహారాజ్, పెరియార్, నారాయణ గురు, సర్వాయి పాపారాయుడు, పండుగ సాయన్న ముదిరాజ్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య పోరాటాల చరిత్రను తెలియ చేయాలి.వారి వీర గాథలతో,త్యాగాల తో స్ఫూర్తి పొంది నూతన రాజకీయ చైతన్యం తొ తాము కోల్పోయిన అస్థిత్వమును, అధికారాన్ని తిరిగి పొందాలి. ప్రజా స్వామ్యములో రాజకీయ అధికారమే అన్ని సమస్యలకు పరిష్కారమన్నారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు. బిసిలు రాజకీయ పోరాటాలకు సిద్ధము కావాలి. బిసి స్పృహ పెంపొందించుకోవాలి. బిసి స్పృహతో డబ్బు ఉన్న బిసిలు రాజకీయాలలోకి రావాలి.అప్పుడే బిసి ల అస్తిత్వానికి గుర్తింపు వస్తుంది ,రాజ్యాధికారం కైవసం అవుతుంది.
2.బిసి ఆత్మాభిమానం:
ప్రతి మనిషికి ఆత్మాభిమానం ఉంటుందికాని హైందవ ధర్మ శాస్త్రాలు శూద్రులను మిగతా మూడు వర్ణాల సేవకులు గ పేర్కొని వీరి ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసాయి.నేటికి బిసి లలో చాలా వర్గాలు మనువాద బ్రాహ్మణ భావజాలం లొ చిక్కుకొని శారీరకంగా మానసికంగా గులాంగిరి కి అలవాటు పడినారు.వారిలో ఆత్మాభిమానాన్ని తట్టి లేపాలి.అందుకు విద్య, ఆర్థిక స్వావలంబన, సామాజిక ఐక్యత, మరియు రాజకీయ ప్రాతినిధ్యం కీలకమైనవి.అన్ని రంగాలలో బిసి సమాజం ముందుకు వెళ్తేనే దేశానికి మేలు జరుగుతుంది అనే విషయాన్ని అందరూ గ్రహించాలి.
3.బిసిల అభివృద్ధి
గత 77 సంవత్సరాలుగా బిసిల అభివృద్ధికి కొన్ని పథకాలు తీసుకువచ్చిన వారి జీవితాల్లో వచ్చిన మార్పు మాత్రం చాలా స్వల్పము. అగ్రవర్ణాల చేతిలో రాజ్యాధికారం ఉండటం వల్ల ఈ పథకాలు ఏవి కూడా చిత్తశుద్ధితో అమలు కాలేదు. బిసి లు తాయిలాల పై బతికె పరిస్థితు ల లోకి నెట్టి వేయబడినారు.అగ్ర,ఆధిపత్య కుల ప్రభుత్వాలు విసిరే ఎంగిలి మెతుకులు వీరికీ జీవనదారలైనవి.కారణం బిసిల చేతిలో రాజ్యాధికారం లేక పోవడమే .అందుకే బిసిలు అధికారం కొరకు తమ ఓట్లు తమ బిసి అభ్యర్ధికే వేసుకొని తమ బిసి ప్రతినిధులను గెలిపించు కోవాలి,రాజ్యాధికారం తెచ్చుకోవాలి అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది.
అలాగే ఏ ఉద్యమములోనైనా ప్రజా అవసరాలె కేంద్రముగా కొన్ని నినాదాలు ఉంటాయి.ఈ నిర్దిష్టమైన నినాదాలె ప్రజా బాహుళ్యం లోకి చొచ్చుకొని పోయి వారిని మేల్కొల్పుతావి.అవి ఉద్యమ నినాదములుగా( ట్యాగ్ లైన్) ఉంటాయి. తెలంగాణలో జరిగినటువంటి సాయుధ పోరాటం ముఖ్యంగా భూమి కొరకు, భుక్తి కొరకు, విముక్తి కొరకు జరిగినటువంటి పోరాటం. అదేవిధంగా మన్యం వీరుడు కొమరం భీమ్ జల్, జంగల్, జమీన్ కొరకు పోరాటం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో జరిగిన తెలంగాణ పోరాటం నీళ్లు, నిధులు, నియామకాల కొరకు జరిగిన పోరాటం. మరి నేడు జరుగుతున్న బిసిల పోరాటం హిస్సా,ఇజ్జత్,హుకుమత్ ల కోరకు.
హిస్సా (వాటా)—అన్ని రంగాలలో అణిచివేయబడ్డ బీసీలు తమ న్యాయబద్ధమైన వాటా కొరకు మేమెంతో మాకంత అంటూ ఉద్యమించడమే నేటి బీసీ ఉద్యమ ముఖ్య కర్తవ్యం.
చదువు తమ జీవితాల్లో వెలుగు నింపుతుందని తమ పేదరిక నిర్మూలనకు అది మార్గం చూపుతోందని, తల్లిదండ్రులు అష్ట కష్టాలు పడి తమ పిల్లలకు చదువులు నేర్పిస్తే ఈరోజు వారికి ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులగ మారి పోతున్నారు లేదా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ గిగ్ వర్కర్స్ గా మారి పోతున్నారు.ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకృత విధానాల వలన ప్రభుత్వ రంగ ఉద్యోగాలు తగ్గి పోవటము వలన వారు తీవ్రంగా నష్ట పోయారు. అదే విధంగా వారి జనాభా దామాషా ప్రకారం వారికి రిజర్వేషన్లు లేకపోవడం వల్ల కూడా ఈ దుర్గతి పట్టడం జరిగింది. ఈరోజు దేశంలో అన్ని వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీలకు ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి, అలాగే 12% ఉన్న అగ్ర వర్ణాలకు కూడా 10% ఇ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ 61% బిసిలు (ముస్లింలతో కలసి) ఉన్న ఒబిసిలకు మాత్రం 27% రిజర్వేషన్ లున్నాయి. ఇది ఎక్కడి సామాజిక న్యాయమో అర్థము కావడము లేదు.
అందుకే బిసిలకు జనాభా దామాషా ప్రకారము రిజర్వేషన్స్ కావాలంటే రాజ్యాధికారముతోనే సాధ్యం.
నిధులు:నేటి మార్కెట్ ఎకానమీలో బీసీలపై శ్రమ దోపిడి కొనసాగుతుంది .రాజకీయ అండతో అగ్ర అధిపత్య కులాలు అందరికి చెందాల్సిన ప్రకృతి సహజ వనరులను దోచుకుని బిలియనీర్స్ గా మారుతుంటే బీసీ లు పెన్షన్లు,రేషను కార్డులు మో,,వాటి కొరకు ప్రభుత్వము పై ఆధార పడి బతకాల్సి వస్తుంది .ప్రభుత్వాలు సంక్షేమం,అభివృద్ధి పేర నామమాత్రం నిధులు ఖర్చు చేస్తూ డాంబికాలు పలుకుతున్నాయి. ఉదాహరణకు తెలంగాణలో గత పది సంవత్సరాలలో 12 బిసి కార్పొరేషన్లకు రూ. 6023 కోట్లు కేటాయించి, ఖర్చు చేసింది కేవలం 319 కోట్లు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం కూడా సంవత్సరానికి 50 లక్షల కోట్ల బడ్జెట్ లో, బిసిల ఆర్థిక అభివృద్ధిపై ఖర్చు పెడుతుంది కేవలం రూ. 2000 కోట్లే. అందుకే నేడు సంచార, అర్ధ సంచార, సేవ, వృత్తి బిసి కులాల బతుకులు దుర్భరంగా మారినవి.
బిసిలకు ఎస్సీ ఎస్టీల వలె సబ్ ప్లాన్ ఉండాలి వారి జనాభా దామాషా ప్రకారం వారికి నిధులు కేటాయించాలి.
విద్యా,ఉద్యోగ,రాజకీయ,ఆర్ధిక,న్యాయ అన్ని రంగాలలొ మా వాటా మాకు కావాలి,రావాలి అని నినదించాలి,ఉద్యమించాలి.
ఇజ్జత్ (ఆత్మ గౌరవం)-ప్రాణం కంటే మానం ముఖ్యమంటారు బీసీ బిడ్డలు.ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తిత్వం.,విలువలతో కూడిన జీవితం వీరి స్వంతం..మరి బీసీ బిడ్డలు ఇంకా ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు బతుకుతారు,.యాచక స్థితి లొ ఉంటారు..తమకు జరుగుతున్నటువంటి అన్యాయాలు సహిస్తారు .ఎదురు తిరిగాల్సిన సమయం ఆసన్నమైంది.అన్ని రంగాల్లో వివక్షత ఎదురుకుంటున్న బీసీ బిడ్డలు తమ యొక్క గౌరవాన్ని పెంపొందించుకోవడానికి తగినటువంటి మానసిక స్తైర్యాన్ని ,ధైర్యాన్ని తెచ్చు కోవాల్సిన అవసరముంది. బీసీలు అంటే వెనుకబడ్డ తరగతులు కాదు బ్రిలియంట్ కులాలు అనేటువంటి విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎదురించే వాడు లేక పోతె బెదిరించే వాడిదే పాలన..ముఖ్యంగ వివిధ రాజకీయ పార్టీల్లో బీసీ నాయకులుగా చలామణి అవుతున్నవారందరూ బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై మీ మీ పార్టీ పెద్దల్ని నిలదీయండి అపార్టీలకు గులాము లుగా,చెంచాలుగా మారకుండా ఆత్మగౌరంతో బతకండి .చేతనైతే సహాయం చేయండి అంతేగాని మీ పార్టి సిద్ధాంతాలని, బీసీల అభివృద్దికి నిరోధకులుగా మారకండి. ప్రజాస్వామ్యములో మెజార్టీ ప్రజలేదే పాలన మరి బిసి లు సంఘటితమై అగ్రవర్ణాల,ఆధిపత్య కులాలో నుంచి రాజ్యాధికారం కైవసం చేసుకొని ఇజ్జత్ గ బ్రతకాలి,,ఇజ్జత్ గ చావాలి..సామాజిక విప్లవానికి, సామాజిక పరివర్తనకు నాంది పలకాలి. పోరాడితే పోయేది ఏమి లేదు,బానిస సంకెళ్లు తప్ప అనే విషయాన్ని గుర్తించాలి.
హుకుమత్ (అధికారం)
రాజకీయ అధికారంలో ప్రాతినిధ్యం లేని సమాజం చనిపోతుంది చాలాకాలంగా మనం వ్యవస్థ తలుపులు తట్టుతూ న్యాయం అడుగుతున్నాను కాని ఏమీ పొందలేకపోతున్నాము.ఇప్పుడు ఆ తలుపులను బద్దలు కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు మాన్యశ్రీ కాన్షి రాం గారు.
రాజ్యాధికారమే సకల సమస్యలకు పరిష్కారమని గుర్తించండి.
గత 77 ఏళ్లుగా తెలంగాణలో ఒక్క బిసి కూడా ముఖ్యమంత్రిగా కాలేకపోయాడు దీనికి ముఖ్య కారణం అసెంబ్లీలో బిసి ల ప్రాతినిధ్యం కేవలం నామ మాత్రముగ ఉండడం , అదేవిధంగా బీసీ లు ఎదగ కుండ అగ్రవర్ణాల ,ఆధిపత్య కులాల కుట్రలు. ఈరోజు చూసిన తెలంగాణలో హిందూ బిసిలు 51% , అసెంబ్లీలో బిసి ఎమ్మెల్యేల సంఖ్య 19 మాత్రమే. అగ్రవర్ణాల వారు 10 శాతం లేనప్పటికిని అసెంబ్లీలో 62 మంది వారే ఉన్నారు. అందుకే ఈరోజు రాజకీయ ప్రాతినిధ్యం పెరిగితే తప్ప బిసిలు ఎదగలేరు. కాబట్టే కచ్చితంగా బిసిలకు ఇప్పుడు కావాల్సింది తమ న్యాయబద్ధమైన రాజకీయ వాటా. ఒక్క శాసనసభలోనే కాదు పార్లమెంట్ లోను స్థానిక సంస్థల్లోనూ .అందుకే బిసి లకు నాయకత్వం అనేది చాలాకీలకం. బిసిలను ఆ దిశగా నడిపించి వారిని చైతన్య పరిచి "ఓట్లు మావే సీట్లు మావే" అనే నినాదముతో రాజ్యాధికారం చేపట్టడమే ఈ ఉద్యమ లక్ష్యము
చరిత్రను మరిచిపోయిన వారు చరిత్రను సృష్టించలేరు అన్నారు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు
తెలంగాణ గడ్డ అనేక ఉద్యమాలకు అడ్డ
సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటం (1946 - 51) నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దింపి భారత యూనియన్ లో కలపడం సామాన్య ప్రజలు సాధించిన నికార్సైన విజయం. అలాగే ముల్కీ ఉద్యమము1952, జగిత్యాల, సిరిసిల్ల రైతాంగ పోరాటం 1977. తెలంగాణ రాష్ట్ర సాధన తొలి దశ ఉద్యమం 1969, మలిదశ 2002 - 2014, మావోయిస్ట్ ఉద్యమం 1980 - 2014 ఇలా అనేక ఉద్యమాలు ఈ గడ్డపై పురుడు పోసుకున్నవే. ఇందులో దాదాపు అన్ని ఉద్యమాలు అనుకున్నది సాధించినవే.కాని ప్రతిసారి త్యాగాలు బీసీ లవి.ప్రతి సారి బహుజనులు మోసపోయారు.ఇంకానా?ఇక పై సాగ కూడదు
ప్రజాస్వామ్యంలో బుల్లెట్ కంటే బ్యాలెట్ చాలా శక్తివంతమైంది ఇప్పుడు అధికారం పొందడానికి ప్రజా ఉద్యమం అవసరం .ఆ ప్రజా ఉద్యమాన్ని ఓట్లుగా మార్చడం ,తరువాత ఓట్లను సీట్లుగా మార్చడం ,సీట్లతో రాష్ట్రాలలో ప్రభుత్వాలని కైవసం చేసుకోవడం అలాగే కేంద్రంలో కూడా .అదే మన లక్ష్యం,అదే మన గమ్యం.
బిసి లు తమ శక్తిని, బలాన్ని తెలుసుకోలేక పోతున్నారు.ఓటు అనే వజ్రాయుధం తో కూకటి వేళ్ళతో పెకిలించివచ్చు.మద్యానికో,డబ్బు కో అమ్ముడు పోకండి కల్పిత హిందూ భావన ప్రచారములో కొట్టుకు పోకండి .బిసి స్పృహ తొ ఓటు హక్కును వినియోగించు కొని అధికారాన్ని చేపట్టవచ్చు.తమ సత్తా చాట వచ్చు.
నేటి బిసి ఉద్యమము కూడా హిస్సా ,ఇజ్జత్,హుకుమత్ ల నినాదము ల తొ బిసిలను చైతన్య పరిచి ,సంఘటిత పరిచి, బోధించి ,పోరాటం చేయడంలో సఫలీకృతం అవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అప్పుడే మెజారిటీ ప్రజలకు సామాజిక న్యాయం అందుతుంది. వారి జీవితాలలో సామాజిక పరివర్తన జరుగుతుంది. అంతిమంగా సాధికారత సాధించి మహనీయుల కల లను సాకారం చేసిన వారవుతారు .
సర్వేజనా సుఖినోభవంతు.
Comments
Post a Comment